-->

'జన్యు లిపి'లో ఆర్యుల వలస చరిత్ర - 'History of Aryan migration in genetic script

Also Read



పుర్వాకాలంలో ప్రపంచమంతటా వలసలు సర్వసామాన్యాలు. ఆత్మోత్కర్షను అలవిమాలిన స్థాయికి పెంచుకుని తామూ, తమ దేశమూ, తమ భాషా, సంస్కృతులూ స్వయంభువులని, ఎలాంటి బాహ్యసంపర్కాలూ లేకుండా స్వతంత్రంగా అభివృద్ధి చెందినవనీ, మనం ఒకరికి ఇచ్చిందే తప్ప తీసుకున్నది ఏమీలేదనీ అనుకునే అవకాశం ఎలా చూసినా లేదు. వలసలు, జనాభా సాంకర్యం నిజమని తేలినా అది ఈ దేశ వైవిధ్యవంతమైన అస్తిత్వానికి మరో నిక్కమైన నిరూపణే అవుతుంది. ఆహార స్వేచ్ఛ, భావప్రకటన స్వేచ్ఛతో సహా అన్ని హక్కులనూ గుర్తించి గౌరవించే ప్రజాస్వామిక వ్యవహరణకు మరింత స్ఫూర్తిదాయకమూ, దోహదమూ అవుతుంది.
 ఆర్యులనబడేవారు భారతదేశానికి బయటినుంచి నిజంగా వచ్చారా, అప్పటికే ఇక్కడ ఉన్న సింధు నాగరికతను ధ్వంసం చేశారా, ఆర్య–ద్రవిడ విభజన నిజమేనా అన్న చర్చ ఈనాటిది కాదు. ఇది గత శతాబ్దకాలంలో వైజ్ఞానిక వివాదాన్ని మించి భావోద్వేగ వివాదంగా మారి రాజకీయాలు, సంస్కృతి, సాహిత్యం, చరిత్ర సహా వివిధరంగాలకు చెందిన ఆలోచనా సరళులను ప్రభావితం చేస్తున్న సంగతి మనకు తెలుసు. సింధు లిపిని ఛేదించి ఉంటే ఈ విషయంలో ఏ కొంచెమైనా స్పష్టత వచ్చేదేమో కానీ, ఆ ప్రయత్నం ఇంతవరకు సందేహాతీతమైన ఫలితాలను ఇవ్వలేదు. అలాంటిది, ఆధునిక శాస్త్రవిజ్ఞానం ఛేదించిన ‘జన్యులిపి’ ఈ వివాదాన్నిఒక కొలిక్కి తెస్తున్నట్టు, ది హిందూ (17 జూన్, 2017)ఒక పూర్తి పేజీ కేటాయిస్తూ ప్రచురించిన టోనీ జోసెఫ్ వ్యాసం వెల్లడిస్తోంది. భారతదేశంలోకి ఆర్యుల వలస నిజంగా జరిగిందనేకాక, ఆ వలసకు సంబంధించి చరిత్రకారులు అందించిన తేదీలను కూడా దాదాపు ధ్రువీకరిస్తోంది. శిలాక్షరం కన్నా కూడా స్థిరాక్షరంగా చెప్పదగిన జన్యులిపి ఆధారంగా జరిగిన అధ్యయనాలను ప్రామాణికంగా తీసుకుంటే ఇది ఈ శతాబ్దిలోనే సుదూరప్రభావం చూపగలిగిన మహావిష్కారం అవుతుంది.
 
 ఆర్యులకు ఉత్తరధ్రువ ప్రాంతం తెలుసునంటూ ఋగ్వేదం నుంచి సాక్ష్యాలు అందించిన నాటి లోకమాన్య బాలగంగాధర తిలక్ నుంచి; ఒకనాడు అనేక జాతులకు భాషలకు ఆవాసమైన మధ్యఆసియాలోని కాస్పియన్ సముద్రప్రాంతమైన కాశ్యపి మీదుగానే ఆర్యులు భారతదేశంలోకి వచ్చారనీ రాసిన ఇటీవలి రాంభట్ల కృష్ణమూర్తి వరకూ ఎందరో పండితులను ఈ సందర్భంలో స్మరించుకోవాలి. ఆర్యులు బండ్ల మీద అగ్నిహోత్రాలు పెట్టుకుని కైబర్, బొలాన్ కనుమల మీదుగా భారత్‌లోకి అడుగుపెట్టారని శ్రీపాద అమృత డాంగే రాశారు. సంస్కృతసాహిత్యాన్నీ, దేశీయ మతసంస్కృతులను, పురావస్తు ఆధారాలతో సహా చరిత్రను మధిస్తూ ఆర్యులరాకను ధ్రువీకరించడమే కాక; క్రీ.పూ. 3000లలో సింధునగరాలు అవతరించాయనీ, ఆర్యుల తొలి ఆక్రమణ క్రీ.పూ. 1750లో, మలి ఆక్రమణ క్రీ.పూ. 1100లో జరిగిందనీ, ఋగ్వేదకాలం క్రీ.పూ. 1500 అనీ, మహాభారతం జరిగి ఉంటే క్రీ.పూ.1000 నాటిదనీ డి.డి.కోశాంబీ అంచనావేశారు. ఇండో –యూరోపియన్ భాషలపై ప్రభావశీలమైన పరిశోధనలు జరిపి, నేటి టర్కీని ఏలిన హిట్టైట్ల లిపిని ఛేదించి అది సంస్కృతంలానే ఇండో–యూరోపియన్ కుటుంబానికి చెందిన క్షత్రభాష అని నిర్ధారించి, తెలుగు, తమిళాలను ద్రావిడభాషలని కాక, సుమేరో– అసీరియన్ భాషలనాలని అంటూ ఈ భాషలకు గల పశ్చిమాసియా చుట్టరికాన్ని చెకొస్లవేకియాకు చెందిన ప్రముఖభాషావేత్త, పురాచరిత్రనిపుణుడు ఫ్రెడరిక్ హ్రోజ్నీ వెల్లడించారు. పశ్చిమాసియాతో దక్షిణభారత జనానికి గల సంబంధాలను ప్రముఖచరిత్రకారుడు నీలకంఠశాస్త్రి చర్చించారు. ఇంకా జోసెఫ్ కాంబెల్, గార్డన్ చైల్డ్, రొమీలా థాపర్, ఆర్.ఎస్.శర్మ, ఇర్ఫాన్ హబీబ్, బి.ఎస్.ఎల్. హనుమంతరావు వంటి ఎందరో ఆర్యుల రాక గురించిన ఆధారాల వెలుగులో చరిత్రను, పురాణ ఇతిహాసాలను గాలించి కొత్త ఆధారాలను జోడిస్తూ ఈ వాదాన్ని పరిపుష్టం చేశారు. జన్యులిపి ఆధారిత తాజా ఆవిష్కారం వీరి నిర్ధారణలను దాదాపు పూర్తిగా సమర్ధిస్తోంది.
 
 టోనీ జోసెఫ్ వ్యాసం జెనెటిక్స్ ఆధారంగా జరిగిన అయిదు అధ్యయనాల వివరాలను క్లుప్తంగా అందిస్తోంది. తేదీలవారీగా చెప్పుకుంటే, 2009లో ప్రొఫెసర్ డేవిడ్ రీచ్ నాయకత్వంలో రూపొందిన అధ్యయనపత్రం, ‘ఉత్తర భారత పూర్వీకులు (ఏన్ సెస్ట్రల్ నార్త్ ఇండియన్స్– ANI– ఏఎన్ఐ)’, ‘దక్షిణభారత పూర్వీకులు (ఏన్ సెస్ట్రల్ సౌత్ ఇండియన్స్– ASI– ఏఎస్ఐ)’ అనే సిద్ధాంతాన్ని ముందుకు తెచ్చింది. జన్యుపరంగా ఉత్తరభారత పూర్వీకులు మధ్యఆసియా, యూరప్ వాసులకు సన్నిహితంగా ఉన్నారనీ, దక్షిణభారత పూర్వీకులు మాత్రం భిన్నంగాఉన్నారనీ ఈ అధ్యయనం అన్నప్పటికీ, ఈ రెండు గ్రూపుల కలయిక ఇండో–యూరోపియన్ భాషీయులు ఇక్కడికి రావడానికి కొన్ని వేల సంవత్సరాలకు ముందే సంభవించినట్టు చెప్పింది. భారత్‌లోని ఇప్పటి అత్యధికజనాభా ఈ ఏఎన్ఐ, ఏఎస్ఐల మిశ్రమానికి చెందినవారని అంటూనే, సాంప్రదాయిక అగ్రవర్ణంలో, ఇండో–యూరోపియన్ భాషీయులలో ఎన్ఎన్ఐ జన్యువు హెచ్చుస్థాయిలో కనిపిస్తోందని వెల్లడించింది. ఏఎన్ఐ బహుళవలసల ఫలితమూ కావచ్చుననీ, అందులో ఇండో–యూరోపియన్ భాషీయుల వలస ఒకటి కావచ్చుననీ అభిప్రాయపడింది తప్ప వారి వలసను ఈ అధ్యయనం తోసిపుచ్చలేదు. అలాంటిది, ఈ అధ్యయనం ఆర్య–ద్రవిడ విభజనను అబద్ధంగా నిర్ధారించినట్టు చెబుతూ మీడియా ఎలా వక్రీకరించిందో, అందులో లేని తేదీలను ఎలా ఇచ్చిందో టోనీ జోసెఫ్ తన వ్యాసంలో ఎత్తిచూపారు.
 
 రెండోది, 2013లో ప్రియా మూర్జాని నాయకత్వంలో రూపొందిన అధ్యయనపత్రం. ఈ పత్రరచనలో డేవిడ్ రీచ్, హైదరాబాద్‌లోని సీసీఎంబీ మాజీ డైరక్టర్ లాల్జీ సింగ్ కూడా భాగస్వాములు. ఇది భారత్‌లోకి ఇండో–యూరోపియన్ భాషీయుల వలస మీద కాక, భారత్‌లో విస్తృతంగా జరిగిన జనాభాసాంకర్యంపై ప్రధానంగా దృష్టిపెట్టింది. ఈ జనాభాసాంకర్యం క్రీ.పూ 1900–4200ల మధ్య జరిగిందనీ, అప్పుడే భారత్‌లో సింధుకు చెందిన పట్టణనాగరికత క్షీణించడం, గంగాపరీవాహకప్రాంత మధ్యంలోనూ, దిగువనా జనసాంద్రత పెరగడం, అంత్యక్రియల పద్ధతులు మారడం, ఇండో–యూరోపియన్ భాషలు, వైదికమతం అడుగుపెట్టడం వంటి పెనుమార్పులు సంభవించాయని ఈ అధ్యయనం చెప్పింది. అనూహ్యవేగంతో జరిగిన ఈ జనాభాసాంకర్యాన్ని ఋగ్వేదం నమోదు చేసిందని డేవిడ్ రీచ్ అంటుండగా, ఆ తర్వాత ఈ సాంకర్యంపై తీవ్రవ్యతిరేకత ఏర్పడి సజాతివివాహాలకు దారితీయించిందని ఈ అధ్యయనం చెబుతూ ప్రాచీనభారతీయ వాఙ్మయం ఈ పరిణామాన్ని కూడా ప్రతిబింబించిన సంగతిని ప్రస్తావించింది. మూడవది, మూడేళ్ళ క్రితం పీటర్ అండర్ హిల్ నాయకత్వంలో 32మంది శాస్త్రవేత్తలు ఆర్1ఏ (R1a) అనే హెప్లోగ్రూపు వ్యాప్తిపై (హెప్లోగ్రూపులు ఏక ఆనువంశికతను గుర్తిస్తాయి) చేసిన విస్తృత అధ్యయనం. దీని ప్రకారం, ఈ ఆర్1ఏ గ్రూపు రెండు ఉప-హేప్లో గ్రూపులుగా చీలిపోయింది. ఒకటి ప్రధానంగా యూరప్‌కు పరిమితమైతే ఇంకొకటి మధ్య, దక్షిణాసియాలకు పరిమితమైంది. యూరప్‌లోని 96 శాతం ఆర్1ఏ నమూనాలు జడ్ 282 అనే ఉప-హేప్లో గ్రూపుకు చెందినవైతే, మధ్య, దక్షిణాసియాలలోని 98.4 శాతం ఆర్1ఏ నమూనాలు జడ్ 93 అనే ఉప-హేప్లో గ్రూపుకు చెందినవని తేలింది. ఈ రెండు గ్రూపులు దాదాపు 5,800 ఏళ్ల క్రితం విడిపోయాయి. భారత్‌లో ప్రబలంగా ఉన్న జడ్ 93 ఆ తర్వాత మరిన్ని శాఖలుగా చీలింది. ఆ చీలిపోవడమూ, ఆ చీలికల విస్తరణా అసాధారణవేగంతో జరిగాయి. అలా చీలిన మూడు ప్రధాన గ్రూపులే ఇప్పుడు భారత్, పాకిస్థాన్, అఫ్ఘానిస్తాన్, హిమాలయ ప్రాంతాలలో ఉన్నాయి.
 
 నాలుగవది, డేవిడ్ పోజ్నిక్ నాయకత్వంలో రూపొంది 2016 ఏప్రిల్‌లో ప్రచురితమైన అధ్యయనపత్రం. పురుషపారంపరికతకు చెందిన వై–డీఎన్ఏ(Y–DNA) విస్తరణను ఇది పరిశీలించింది. ఈ పత్రరచనలో పైన పేర్కొన్న డా. అండర్ హిల్ సహా 42మంది శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. జడ్ 93నుంచి చీలిన గ్రూపుల విస్తరణ ఇంచుమించు 4,000–4,500 సంవత్సరాల క్రితం భారీఎత్తున జరిగినట్టు ఈ అధ్యయనం తేల్చింది.
 సింధునాగరికత అంతరిస్తున్న కాలమూ దాదాపు అదే. అయిదవది, ప్రొ. మార్టిన్ పి. రిచర్డ్స్ నేతృత్వంలో 16మంది శాస్త్రవేత్తలు మూడు మాసాల క్రితం వెలువరించిన అధ్యయనపత్రం. టోనీ జోసెఫ్ ప్రకారం, ఇది ఇంతవరకు జరిగిన పరిశోధనలను ఒకచోట చేర్చి, పొందికైన వలసచరిత్రను నిర్మించడానికి ప్రయత్నించింది. గత 12,500 సంవత్సరాల కాలంలో భారతీయ జన్యుసంపుటిలోకి బయటనుంచి కొత్త జన్యువులు ఏవీ ప్రవేశించలేదని, ఇంతవరకు అందుబాటులో ఉన్న మాతృపారంపరిక (mtDNA -తల్లి నుంచి కూతురికి సంక్రమించేది) డీఎన్ఏ డేటా సూచిస్తుండగా, కొత్తగానూ విరివిగానూ అందుబాటులోకి వచ్చిన పురుషపారంపరికతను సూచించే వై క్రోమోజోమ్‌కు చెందిన డీఎన్ఏ డేటా ఆ పరిశీలనను ఎలా తలకిందులు చేస్తోందో ఈ పత్రం వెల్లడించింది. క్రీ.పూ. 2000 ప్రాంతంలో, అంటే ఇప్పటికి 4వేల పై చిలుకు ఏళ్ల క్రితం భారతీయ పురుషపారంపరికతలోకి బయటనుంచి కొత్తజన్యువు ప్రవేశించిందని, తల్లి పారంపరికజన్యువులో ఈ సమాచారం లోపించడానికి కారణం, ఈ కొత్త పురుష పారంపరికజన్యువుకు కారణమైన వలసదారులు తమ స్త్రీలను వెంటబెట్టుకుని రాకపోవడమేనని చెప్పింది. భారత్‌లో 17.5 శాతం పురుషపారంపరికత- ఒకే ఆనువంశికతను సూచించే ఆర్1ఏకి చెందినదని వై–డీఎన్ఏ డేటా వెల్లడించింది. ఈ ఆర్1ఏ గ్రూపు ఈరోజున మధ్య ఆసియా, యూరప్, దక్షిణాసియాలలో వ్యాపించి ఉంది.
 భారత్‌లోకి ఆర్యుల వలసకంటే విస్తారంగా జరిగిన వాటితో సహా మరికొన్ని వలసలు ఉన్నాయనీ టోనీ జోసెఫ్ గుర్తుచేశారు. అవి, 1. 55,000–65,000 ఏళ్లక్రితం ఆఫ్రికా నుంచి జరిగినవి. 2. క్రీ.పూ. 10,000 తర్వాత పశ్చిమాసియా నుంచి అలలు అలలుగా సాగిన వ్యవసాయసంబంధ వలసలు. 3. తూర్పుఆసియా నుంచి ముండా వంటి ఆఫ్రో-ఏషియన్ భాషీయుల వలసలు. 4. తూర్పుఆసియా నుంచే టిబెటన్–బర్మన్ భాషీయుల వలసలు. జన్యుఆధారాలు వీటినీ ధ్రువీకరించినా ఆశ్చర్యంలేదు. ఆర్య–ద్రవిడ విభజనను తీవ్రంగా వ్యతిరేకించే భావజాలానికి చెందినవారు అధికారంలో ఉండి, భాష, చరిత్ర, సంస్కృతి, సాహిత్యం వగైరా రంగాలను తమ విభజన వ్యతిరేక భావజాలానికి అనుకూలంగా మలచుకునే ప్రయత్నం చేస్తున్న ఘట్టంలో ఆర్యుల వలస గురించిన ఇలాంటి జన్యుఆధారాలు వెలుగు చూస్తుండడం గమనించవలసిన యాదృచ్ఛికత. వీటి పర్యవసానాలు, ప్రభావాలు అన్ని రంగాల్లో బహుముఖంగా ఉండగల అవకాశముంది.
 అయితే, ఆర్యులనేవారు ఎక్కడినుంచో రాలేదనీ, భారతీయపూర్వులు 15వేల సంవత్సరాలక్రితమే మధ్య, పశ్చిమాసియా, యూరప్‌లకు విస్తరించి అక్కడి జనాభాలో కలసిపోయారనే వాదమూ ఉంది. ఆవిధంగా జనాభాసాంకర్యం జరిగిందనడంలో ఉభయవాదాల మధ్య ఏకీభావం ఉన్నప్పుడు, ‘వలసలు–జనాభాసాంకర్యం’ అన్న కోణం ప్రస్ఫుటంగా ముందుకొస్తుంది. పురాకాలంలో ప్రపంచమంతటా వలసలు సర్వసామాన్యాలు. ఆత్మోత్కర్షను అలవిమాలిన స్థాయికి పెంచుకుని తామూ, తమ దేశమూ, తమ భాషా, సంస్కృతులూ స్వయంభువులని, ఎలాంటి బాహ్యసంపర్కాలూ లేకుండా స్వతంత్రంగా అభివృద్ధి చెందినవనీ, మనం ఒకరికి ఇచ్చిందే తప్ప తీసుకున్నది ఏమీలేదనీ అనుకునే అవకాశం ఎలా చూసినా లేదు. పురామానవుడి అనుభవవైశాల్యాన్ని కొలవడానికి నేటి మన కొలమానాలు పనికిరావు. నేటిలా ప్రయాణసాధనాలు లేని రోజుల్లో కూడా పురామానవుడు మనం చూడనంత ప్రపంచాన్ని చూశాడని, నేడు మనకు లేనంత భావవైశాల్యాన్ని పెంచుకున్నాడనీ ప్రముఖ చరిత్రకారుడు హెచ్.జి.వెల్స్ అంటాడు. వలసలు, జనాభాసాంకర్యం నిజమని తేలినా అది ఈ దేశవైవిధ్యవంతమైన అస్తిత్వానికి మరో నిక్కమైన నిరూపణే అవుతుంది. ఆహారస్వేచ్ఛ, భావప్రకటన స్వేచ్ఛతో సహా అన్ని హక్కులనూ గుర్తించి గౌరవించే ప్రజాస్వామిక వ్యవహరణకు మరింత స్ఫూర్తిదాయకమూ, దోహదమూ అవుతుంది.

Close